18, అక్టోబర్ 2023, బుధవారం

డాలస్లో మంచు

                                                                          డాక్టరు. గన్నవరపు వరాహ నరసింహమూర్తి.

2010 ఫిబ్రవరి 11/12 తారీకుల్లో మా డల్లసులో 12 అంగుళాల మంచుపడింది. మామగారైన హిమవంతుడి "మంచు" భాష్పాలు...మహాశివుడి  "లింగోద్భవన" మహాశివరాత్రి సందర్భాన వ్రాసుకొన్న పద్యాలు. 


#1 మంచు 



 

సీసం .
పాలకడలి పొంగి నేల ముంచిన భంగి
వెల్లదనము పూచె పల్లె యంత
ధవళ ప్రభల రాశి ధరణి రాలు సరణి 
సితము వఱలె నుర్వి సీమ యంత
కప్పురపు పొడులు కప్పెఁ గాశ్యపి నన
శ్వేతచూర్ణము చిందె భూతలమ్ము
వసుమతీజములందు కుసుమవల్లుల తీరు
శుక్లపుంజము విచ్చె సురభిపైన 

తే.గీ. అంచపిండులఁ బోలుచు మంచు పొరలు
పంచదారలు కరణిని ముంచె నవని 
హేమరాశుల పూర్ణమై యిలయు వెలయ
ధవళవస్త్రము గట్టె మా ధరణి మాత ! 

 

(హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారు నా పద్యమును వారి ‘ గిరిజా కల్యాణం’ కథలో చేర్చి పాడడం నా అదృష్టం.)

 
కడలి =సముద్రము :  

వెల్లదనము = ధవళ = సితము= శ్వేత = తెలుపు :  

వసుమతీజము= వృక్షము :

వసుమతి = ధరణి = అవని = కాశ్యపి =భూమి :
అంచ పిండులు = హంసల సముదాయము 

#2    గిరిజా కళ్యాణం 


దక్షు నింట తన భర్త పరమ శివుని అవమానమునకు ఓర్వ లేక సతి ప్రాణముల నర్పించినది. మరల హిమవంతుని కూతురై పుట్టినది.

 

  కం. పశుపతికై సతి వీడిచె
       నసువులు తన తండ్రి యింట నలుకన దక్షున్
       పశుపతికై సతి పుట్టెను
       పస దీఱిన రాజు నింట పర్వత తనయై.


 కం.  గిరిసుత పెచ్చిన ముద్దుల
       పెరిగెను నగనాధు నింట పెన్నిధి గాదే
       అరయక ముద్దులు దీర్చెడి
       గిరిరాజుకు పట్టి యౌట క్షేమము గాదే !

 

ఆ.వె. పెళ్ళియీడు రాగ మళ్ళెను హృదయము
        పరమశివునిపైనఁ బార్వతికిని
        తనువు మనము నిల్పి తపముఁ దా సలుపుచు
        గెలిచెఁ బరమశివుని గిరిజ భక్తి.

 

చం. తపముల గెల్చెఁ  బార్వతియు తన్మత నొందుచుఁ గామవైరినిన్

      ‘సఫలత నొందె జన్మ’మనె సాధ్వికిఁ  దండ్రగు  పర్వతీశుడున్
      ‘నెపములు నేల నింకయును  నెయ్యము వియ్యము సేయు డం’చటన్
      విపులతఁ బల్కినారు వినువీధుల దేవత దైవగణ్యులున్.

 

 ఆ.వె. పెళ్ళి నిశ్చయంబు పెద్దలు సేయంగ
        మంచుకొండ పట్టి మదిని మురిసె
        హిమము నేల నొంపె హిమవంతు డారాజు
        సంతసించి కంటిజలము గార్చె

 

అప్పుడు పెళ్ళికి సన్నిద్ధుడై, బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు, యక్ష, గంధర్వ, కింపురుష, కిన్నెరలు, అశ్వనీ దేవతలు, ప్రమథి గణంబుల సపరివారముతో ,


 సీసం.  జటలందు జలకన్య జలకమ్ము లాడంగ
          నెలవంక వెలుగులు నెమ్మి నీయ
          శితికంఠమున ఫణి శిరమును నూపంగ
          చేతిలో ఢమఢక్క చిందులేయ
          కరిచర్మము తనువు గాంతులు వెదజల్ల
          శూలంబు  దిక్కులఁ జొచ్చుచుండ
          భస్మంబు దేహప్రభావము వర్ధింప
          పునుక నిండుగ మెఱపులను గురియ 


 తే.గీ. నందికేశుడు ఱంకెల నాట్య మాడ
        ప్రమథి గణములు భక్తితో ప్రస్తుతింప
        పెళ్ళికొమరుడు శుభముల పెన్నిధుండు
        పరమశివు డరుదెంచె నా పద్మముఖికి. 

 


(హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారు నా పద్యమును వారి ‘ గిరిజా కల్యాణం’ కథలో చేర్చి పాడడం నా అదృష్టం.)


 అప్పుడు,

 

 ఉ. చల్లని మంచుకొండ మనసారగ మెచ్చుచు నల్లు నీశ్వరున్

    మెల్లన గార్చె బాష్పములు, మేదిని నంతట హేమవర్షమున్ 

    ఝల్లన గుండె లీశ్వరుని చర్మము జల్లెను భస్మరాశులన్
    దెల్లయె ధాత్రి యంతయును దిక్కుల నన్నిట శైవరాత్రిలో. 

 

 ఈ కధ చదివిన వినిన పుణ్య జనంబులకు సకల పాపములు తొలగి యిహలోక పరలోక సౌఖ్యములు కలుగుతాయి.

                               

                                                                       

 


పశుపతి = ఈశ్వరుడు : నగము = కొండ : నగనాధుడు = పర్వత రాజు : శితి కంఠుడు = నీల కంఠుడు : పట్టి = కూతురు, కొడుకు : పునుకు = పుఱ్ఱె

 

 

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...